ఢిల్లీ టూర్ కు షర్మిల…? అమిత్ షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసులా మారారు. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్ పై రివెంజ్ మోడ్ లోనే ఉన్నారు.

Post Published By: Vencateshg
Updated : 30 November 2024, 7:20 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసులా మారారు. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్ పై రివెంజ్ మోడ్ లోనే ఉన్నారు. కీలక విషయాల్లో జగన్ ను ఇరుకున పెట్టేందుకు షర్మిల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు కాంగ్రెస్ కు దగ్గర కానీయడం లేదు. మరో వైపు... కుటుంబ సమస్యలను రోడ్డుకు తెస్తూ జగన్ శిభిరానికి తలనొప్పిగా మారారు.

వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరులో ప్రజలు షర్మిలకు మద్దతుగా నిలవడం ఆశ్చర్యం కలిగించింది. అక్రమాస్తులను తనకు పంచాలి అని షర్మిల డిమాండ్ చేయడం బాగానే ఉంది గాని... దానికి టీడీపీ సహా సామాన్య ప్రజల్లో... ఆమెకు మద్దతు రావడం షాక్ కి గురి చేసింది. ఇక కూటమి సర్కార్ నుంచి కూడా షర్మిలకు మంచి మద్దతు లభిస్తోంది. ఆమె విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారు. షర్మిలకు భద్రత అడిగితే కల్పిస్తాం అని అది తమ బాధ్యత అని అన్నారు.

ఇక షర్మిల ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో జగన్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఢిల్లీ టూర్ కు వెళ్ళడానికి రెడీ అయ్యారు. దాని వెనుక బలమైన కారణమే ఉంది. అదాని వ్యవహారంలో జగన్ ను ఎలా అయినా ఇబ్బంది పెట్టేందుకు షర్మిల వర్కౌట్ స్టార్ట్ చేసారు. ఏపీ గవర్నర్ ను కూడా కలిసి ఆమె ఫిర్యాదు చేసారు. కర్ణాటక సిఎంపై గవర్నర్ విచారణకు ఆదేశించారు అని... మీరు కూడా జగన్ పై విచారణకు ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు.

జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ అబద్దాలు ఆడతారు కాబట్టే ఆయనకు ఆడపిల్లలు పుట్టారని అన్నారు. అలాగే అదానితో జరిగిన ఒప్పందాలపై జగన్ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలను చూసి విచారణకు ఆదేశించాలి అని గవర్నర్ ను కోరారు షర్మిల. ఇప్పుడు ఢిల్లీ టూర్ కు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేయడానికి షర్మిల రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తన వద్ద ఉన్న సాక్ష్యాలను అందించాలని ఆమె భావిస్తున్నారు. గత అయిదేళ్లుగా ఏం జరిగింది అనే కీలక అంశాలపై ఆధారాలను అమిత్ షాకు అందిస్తారు.

కర్ణాటకలో ముడా భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కాబట్టి కచ్చితంగా జగన్ పై కూడా విచారణకు ఆదేశించాల్సిందే అని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే ఆమె సీఎం చంద్రబాబును, ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. త్వరలోనే షర్మిల ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుతో కలిసి ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరినట్టు సమాచారం. ఈ అంశంపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో ఆమె వచ్చే వారం భేటీ కానున్నారు.

Published : 
  • 30 November 2024, 7:20 PM IST