పాకిస్థాన్ జట్టు టీ20 వరల్డ్ కప్లో సూపర్-8 దశకు చేరింది. నెదర్లాండ్స్పై కష్టం మీద గెలిచి.. భారత్ చేతిలో ఓటమితో ఒత్తిడికి లోనైన పాకిస్థాన్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది. కొలంబో వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రత్యర్థిని 97 పరుగులకే ఆలౌట్ చేసిన పాక్.. 102 పరుగుల భారీ తేడాతో గెలిచి సూపర్-8లో అడుగుపెట్టింది.భారత్తో జరిగిన మ్యాచ్లో తొలి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ .. నమీబియాపై అజేయ శతకం బాదాడు. 11 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 58 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఓ దశలో 27 బంతుల్లో 30 రన్స్ మాత్రమే చేసిన ఫర్హాన్ ఆ తర్వాత చాలా వేగంగా పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 99 పరుగులతో ఉన్న ఫర్హాన్.. 20వ ఓవర్ తొలి బంతికి షాదాబ్ సింగిల్ తీసి ఇవ్వడంతో.. తర్వాతి బంతికి శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్ కప్లో అహ్మద్ షెహజాద్ తర్వాత సెంచరీ చేసిన రెండో పాకిస్థానీ బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఈ ఓవర్లో షాదాబ్ రెండు సిక్సర్లు కొట్టగా.. ఫర్హాన్ రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆఖరి ఓవర్లో సెంచరీ కోసం సింగిల్ తీసిన ఫర్హాన్ స్వార్థపరుడంటూ భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు.
పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్.. గత ఏడాది జరిగిన ఆసియా కప్లో బుమ్రా బౌలింగ్లో మూడు సిక్సులు కొట్టాడు. భారత్పై హాఫ్ సెంచరీ చేశాక గన్ షూట్ సెలబ్రేషన్స్తో వివాదానికి తెర తీశాడు. ఈ టీ20 వరల్డ్ కప్లోనూ బుమ్రా బౌలింగ్లో అతడు సిక్సులు కొడతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ హార్దిక్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫర్హాన్ ఔటయ్యాడు. భారత్తో మ్యాచ్లో విఫలమైనప్పటికీ, మిగతా మ్యాచ్ల్లో ఫర్హాన్ సత్తా చాటాడు. నెదర్లాండ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 47 రన్స్ చేసిన ఫర్హాన్.. అమెరికాతో జరిగిన మ్యాచ్లో 73 రన్స్ చేశాడు. చిన్న జట్లపై చెలరేగిన ఆడిన ఫర్హాన్.. ఈ టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫర్హాన్ 4 మ్యాచ్ల్లో 73.33 యావరేజ్తో 220 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా కెప్టెన్ అయిడెన్ మార్క్రమ్ 178 రన్స్తో రెండో స్థానంలో ఉండగా.. ఇషాన్ కిషన్ 176 రన్స్తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.