టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ రీ ఎంట్రీలో దుమ్ము దులిపేశాడు. గతేడాది డిసెంబర్లో గాయపడ్డ తిలక్, ఇటీవలే కోలుకొని టీమ్ఇండియా వరల్డ్కప్ జట్టుతో చేరాడు. వచ్చీ రాగానే బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తన రికవరీ గురించి మాట్లాడాడు. తాను ఇంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తానని ఊహించలేదని అన్నాడు. దీనికి ఎంతగానో తోడ్పడిన బీసీసీఐ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు తిలక్ థాంక్స్ చెప్పాడు. ఈ మేరకు బీసీసీఐ అతడు మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. నిజాయితీగా చెప్పాలంటే,తాను ఇంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తానని ఊహించలేదన్నాడు.
ప్రపంచ కప్లో ఆడటం తన డ్రీమ్ అని చెప్పిన తిలక్ అది నిజం అవ్వడం జోష్ పెంచిందన్నాడు. వార్మప్ మ్యాచ్ లో ఇషాన్, అభిషేక్తోపాటు మిగిలిన వాళ్లు బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని పరిశీలించాననీ, అందుకే తానూ భారీ షాట్లు కొట్టగలనని అనిపించిందని తిలక్ వర్మ అన్నాడు.కాగా వార్మప్ మ్యాచ్కు ఇంత మంది ప్రేక్షకులు రావడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. వారు ఇచ్చిన ఉత్సాహం నిజంగా అద్భుతంగా ఉందనీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. వాతావరణం కూడా చాలా బాగుందనీ, ఇప్పుడు టీమ్ ఇండియా వరల్డ్ కప్కు పూర్తిగా సిద్ధంగా ఉందని తిలక్ వర్మ తెలిపాడు.
తిలక్ వర్మ ఇప్పటివరకు 15 టీ20ల్లో 542 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసక్తికరంగా, రెండు శతకాలు కూడా దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో చేసినవే. కాగా.. సరైన సమయంలో తిలక్ వర్మ రీఎంట్రీ ఇవ్వడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు జట్టు దృష్టి మొత్తం వరల్డ్ కప్ తొలి మ్యాచ్పైనే ఉంది. శనివారం అమెరికాతో జరిగే మ్యాచ్కు ముందు, తిలక్ వర్మ ఇన్నింగ్స్, అభిమానులకూ మరింత నమ్మకాన్ని పెంచింది. గాయం నుంచి తిరిగి వచ్చిన తిలక్ పూర్తి ఫిట్ నెస్ సాధించి ఫామ్ లోకి రావడంపై అభిమానులు సంబరపడుతున్నారు.