చివరి వన్డేలోనూ భారత్ మహిళల ఓటమి… సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్…!

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.

Post Published By: dialnews
Updated : 2 March 2026, 9:30 PM IST

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అలీసా హీలీ 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స్‌లతో 158 , బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 106 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. రేణుక సింగ్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ 29 బంతుల్లో 9 ఫోర్లతో 42, స్నేహ్ రాణా 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలాన కింగ్ నాలుగు వికెట్లు తీయగా.. జార్జియో వేర్‌హమ్ రెండు వికెట్లు పడగొట్టింది.

నికోల క్యారీ, అన్నాబెల్ సదర్లాండ్, అష్లే గార్డ్‌నర్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌తో కెరీర్ కు వీడ్కోలు పలికిన అలీసా హీలీ అద్భుతమైన శతకంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌కు అలీసా హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ హాజరయ్యాడు. ఆమె శతకానికి ఫిదా అయిన అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అలీసా హీలీకి భారత ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఆసీస్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్ గెలిచిన భారత జట్టు.. వన్డేల్లో 0-3తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

Published : 
  • 2 March 2026, 9:30 PM IST