ఇంగ్లాండ్ జట్టుతో జులై 1 నుంచి ప్రారంభం కాబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఉపశమనం లభించింది. గాయం కారణంగా ఐర్లాండ్ పర్యటనకు దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం పూర్తిగా కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టుకు, వరుణ్ రాక మిడిల్ ఓవర్లలో బౌలింగ్ను బలోపేతం చేయడానికి ఎంతో కీలకం కానుంది.ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికీ.. చివరి నిమిషంలో గాయపడటంతో వరుణ్ చక్రవర్తి మ్యాచ్లు ఆడలేకపోయాడు.
వరుణ్ చక్రవర్తి లేని లోటు భారత బౌలింగ్లో స్పష్టంగా కనిపించింది. దీనిని ఆసరాగా చేసుకుని ఐర్లాండ్ బ్యాటర్లు భారీగా పరుగులు సాధించి సిరీస్ కైవసం చేసుకున్నారు. అయితే వరున చక్రవర్తి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. వరుణ్ చక్రవర్తి రాకతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బౌలింగ్లో కొత్త ఆయుధం లభించినట్లు అయింది.వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావడంతో మొదటి టీ20 ఆడే తుది జట్టు ఎంపిక యాజమాన్యానికి పెద్ద సవాల్గా మారింది.
పిచ్ పరిస్థితులను బట్టి భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాలని భావిస్తే.. యువ పేసర్లు హర్షిత్ రాణా లేదా కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిన్స్ యాదవ్లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అర్ష్దీప్ సింగ్ ప్రధాన పేసర్గా కొనసాగుతుండగా.. వరుణ్ చక్రవర్తికి చోటు దక్కాలంటే ప్రిన్స్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి రావచ్చు. మరోవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని.. సంజూ శాంసనే ఓపెనర్గా బరిలోకి దిగుతాడని సమాచారం.