టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ స్కాట్లాండ్ పై గెలిచిన కరేబియన్ టీమ్ తాజాగా ఇంగ్లాండ్ కు షాకిచ్చింది. కొత్త ప్లేయర్స్ తో నిండిన విండీస్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లీష్ జట్టును 30 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ కు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ , షైహోప్ నిరాశపరిచారు. దీంతో విండీస్ కేవలం 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెట్ మెయిర్, రోస్టన్ ఛేజ్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 47 పరుగులు జోడించారు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా రూథర్ ఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పావెల్ తో కలిసి 51, జాసన్ హోల్డర్ తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రూథర్ ఫర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2, ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టారు.వాంఖేడే స్టేడియం ఛేజింగ్ పిచ్ కావడంతో ఇంగ్లాండ్ గెలుపు ఖాయమని చాలా మంది అంచనా వేశారు. దానికి తగ్గట్టే ఓపెనర్లు ఫిల్ సాల్ట్ , బట్లర్ దూకుడుగా ఆడారు.
తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత జాకబ్ బెథెల్ 33, బ్రూక్ 17 పరుగులకు ఔటవగా.. చివర్లో సామ్ కరన్ మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు చివరి వరకూ అతను పోరాడినా పరుగుల అంతరం మాత్రమే తగ్గించగలిగాడు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులు ఆలౌటైంది. సామ్ కరన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వెస్టిండీస్ స్పిన్నర్ గుడాకేష్ మోతీ మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గ్రూప్ సిలో వెస్టిండీస్ 2 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లాండ్ ఒక విజయం, ఒక ఓటమితో రెండో ప్లేస్ లో నిలిచింది.ఈ పరాజయంతో సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సంక్లిష్టం చేసుకోగా.. వెస్టిండీస్ మెరుగుపర్చుకుంది.