ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఊసే లేదు గానీ, బెజవాడ పాలిటిక్స్లో మాత్రం అప్పుడే సినిమా క్లైమాక్స్ రేంజ్ సీన్లు మొదలైపోయాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడుతుందనే ధీమాతో ఉన్న తమ్ముళ్లు.. కాబోయే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే రూట్ మ్యాప్లు సిద్ధం చేసుకుంటున్నారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉంటూ, ఏపీకి గుండెకాయ లాంటి విజయవాడ కార్పొరేషన్కు 'మేయర్' ఎవరు అనేది ఇంకా అధిష్టానమే తేల్చలేదు.. కానీ ఇక్కడ లాబీయింగ్ మాత్రం పీక్స్కి చేరింది. ఈ క్రమంలోనే బెజవాడ పాలిటిక్స్లో దశాబ్దాల చరిత్ర కలిగిన దేవినేని కుటుంబం రంగంలోకి దూకి సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ మేయర్ స్థానంపై దేవినేని కుటుంబం గట్టిగా ఫోకస్ పెట్టింది. మిగిలిన వాళ్లంతా లోకల్ గా ప్లాన్లు వేస్తుంటే.. ఈ ఫ్యామిలీ మాత్రం డైరెక్ట్ గా మంగళగిరి బాస్నే టార్గెట్ చేసింది. తాజాగా దేవినేని చందు తన భార్య మహిత, తల్లి అపర్ణ దేవితో కలిసి ఐటీ మంత్రి నారా లోకేష్ను అమరావతిలో పర్సనల్గా కలిశారు. అక్కడ దాకా బాగానే ఉంది కానీ.. ఆ తర్వాత దేవినేని చందు సోషల్ మీడియాలో లోకేష్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పెట్టిన ఒక క్యాప్షన్ ఇప్పుడు బెజవాడ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. "ఒక మర్యాదపూర్వక కలయిక… ఒక కొత్త ఆశ" అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ "కొత్త ఆశ" వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో ఆన్ లైన్ జనాలకి, బెజవాడ లీడర్లకి అర్థం కావడానికి పెద్ద టైమ్ పట్టలేదు భయ్యా. రాబోయే విజయవాడ మేయర్ సీటు రేసులో తమ పేరును, ముఖ్యంగా దేవినేని మహిత పేరును కూడా పరిశీలించాలనేదే ఆ బిగ్ ప్లాన్. దేవినేని నెహ్రూ కాలం నాటి పాత కేడర్, పాత ఇమేజ్ను వాడుకుని ఎలాగైనా బెజవాడ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఈ యువ నాయకత్వం స్పీడ్ పెంచింది. నోటిఫికేషన్ ఊసే లేకుండా దేవినేని ఫ్యామిలీ ఇలా ముందస్తుగా వెళ్లి లోకేష్ అపాయింట్మెంట్ సాదించేసరికి.. ఇప్పటికే మేయర్ సీటుపై కర్చీఫ్లు వేసుకుని తిరుగుతున్న మిగిలిన సీనియర్ తమ్ముళ్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది. "అయ్యా.. మేం ఎప్పటి నుంచో లైన్ లో ఉంటే.. వీళ్లు అప్పుడే పై లెవెల్ లో డీల్స్ మాట్లాడుకుంటున్నారేంటి..?" అంటూ లోకల్ లీడర్లు లోలోపల కుతకుతలాడిపోతున్నారట.
అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎవరికీ ముందస్తు కన్ఫర్మేషన్ ఇవ్వకుండా భలే సస్పెన్స్ మెయింటెన్ చేస్తోంది. బెజవాడ కార్పొరేషన్ పీఠంపై ఇప్పటికే చాలా మంది సీనియర్ లీడర్ల వారసులు, పెద్ద పెద్ద తలకాయలు క్యూ కట్టి ఉండటంతో.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సామాజిక సమీకరణాల లెక్కలు వేస్తూ సైలెంట్గా ఉండిపోయారు. కేవలం ఎన్నికల సమయంలో పార్టీ కోసం నమ్మకంగా ఉండి, క్షేత్రస్థాయిలో కష్టపడిన ఒరిజినల్ కేడర్కే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టాన వర్గాల సమాచారం. "టికెట్ ఎవరికి దక్కినా మీ ఈగోలు పక్కనబెట్టి కలిసి పనిచేయండి.. పార్టీ గెలుపే ముఖ్యం" అంటూ ముందే లెక్చర్లు ఇస్తున్న అధిష్టానం, చివరి నిమిషంలో ఎవరి ఆశను నెరవేరుస్తుందో, ఎవరికి హ్యాండ్ ఇస్తుందో చూడాలి మరి.