పుణె మర్డర్ కేసులో హృదయవిదారక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సియాను ఎంతగానో ఇష్టపడ్డ కేతన్ అగర్వాల్.. ఆమెతో ఏడడుగులు నడవాలని ఎన్నో కమ్మని కలలు కన్నాడు. దాదాపు 600 కోట్ల ఆస్తికి వారసుడైన కేతన్ తన పెళ్లిని అంగరంగ వైభవంగా జరపాలని ఆశపడ్డాడు. కాబోయే భార్య కోసం రాజస్థాన్లో ఏకంగా 17 కోట్ల ఖర్చుతో ఓ లగ్జరీ ప్యాలెస్ను కూడా బుక్ చేశాడు. సియాతో ట్రిప్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ పూర్తయిన తర్వాత, సంతోషంగా పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నాడు. కానీ, అతడు ప్రాణంగా నమ్మిన ఆ కాబోయే భార్య చేతిలోనే అత్యంత దారుణంగా ప్రాణాలు వదిలాడు. సియాకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు.
ప్రియుడు చేతన్ చౌదరి మోజులో పడిన ఆమె, పెళ్లి వద్దని చెప్పడానికి బదులుగా కేతన్ను భూమ్మీద లేకుండా చేయాలని కరుడుగట్టిన నేరస్థురాలిలా ఆలోచించింది. ప్రియుడితో ఏకంగా 238 గంటల పాటు ఫోన్లో మాట్లాడి మరణశాసనం లిఖించింది. జూన్ 6న బాలి ట్రిప్ వెళ్లకుండా పాస్పోర్ట్ దొంగిలించి చించేసిన సియా.. జూన్ 14న లోహగఢ్ ఫోర్ట్లో పాము ఉందంటూ నాటకమాడి తొలిసారి లోయలోకి తోసే ప్రయత్నం చేసింది. చివరగా జూన్ 18న అదే లోహగఢ్ ఫోర్ట్ వద్ద తన ప్రియుడి సాయంతో కేతన్ను 400 అడుగుల లోయలోకి నెట్టేసి నిస్సహాయుడిని చేసి చంపేసింది.
ఒకవేళ ఇక్కడ కూడా బతికిపోతే మహాబలేశ్వర్లో చంపేందుకు 'ప్లాన్-సి' కూడా రెడీ చేసుకుందంటే ఆమె ఎంత క్రూరంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘాతుకంతో కేతన్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. "మా అబ్బాయి ఆమెను ఎంతగానో ప్రేమించాడు.. ఒకవేళ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట మాకు చెప్పి ఉంటే, ఈ పెళ్లిని మేమే ఆపేసేవాళ్లం. అంతేకానీ, ఇంత నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా మా కొడుకును పొట్టనబెట్టుకోవాలా?" అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. పెళ్లి జరిగి, భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించాలన్ని కేతన్ ఆశలు ఇలా మరణశాసనంగా మారడం ప్రతి ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తోంది.
No related posts found.