Sharmila meets Jagan: జగన్ షర్మిల ఏం మాట్లాడుకున్నారు ? ఆ రూమ్ లో ఏం జరిగింది ??

ఏపీ సీఎం జగన్ ను ఆయన చెల్లెలు షర్మిల కలుసుకోవడం ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే దాదాపు రెండేళ్ళ తరువాత అన్నాచెల్లెళ్ళు కలుసుకోగా.. అందుకోసం తల్లి విజయమ్మ రాయబారం చేయాల్సి వచ్చింది. అయితే జగన్ - షర్మిల కలుసుకున్న ఫోటోలు బయటకు ఎందుకు రాలేదు ? అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది అన్నది ఆసక్తికరంగా మారింది.

Post Published By: dialnews
Updated : 4 January 2024, 8:25 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో విభేదించి బయటకు వచ్చి… తెలంగాణలో పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన చెల్లెలు షర్మిల... దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ను ఫేస్ టు ఫేస్ కలిశారు. కొడుకు రాజారెడ్డి పెళ్లి శుభలేఖను జగన్ కు ఇవ్వడానికి షర్మిల కలవడం వెనక పెద్ద డ్రామా నడిచింది.  షర్మిల-జగన్ కలయిక కోసం తల్లి విజయమ్మ గట్టి రాయబారం చేయాల్సి వచ్చింది. నిజానికి వారం రోజుల క్రితం జగన్ తన బాబాయ్ వై. వి. సుబ్బారెడ్డిని షర్మిల దగ్గరికి పంపారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ఆలోచన మానుకోవాలని, కాంగ్రెస్ కి దూరంగా ఉండాలని, అలాగే తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసి తిరిగి తన దగ్గరికి రావాలని సందేశం పంపారు. షర్మిల, విజయమ్మతో సమావేశమైన సుబ్బారెడ్డి...  ఇదే విషయాన్ని చెప్పి,  షర్మిలను దారికి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది.  నిర్మొహమాటంగా షర్మిల తన నిర్ణయాన్ని చెప్పేశారు. కాంగ్రెస్ లో చేరడం, ఏపీలో రాజకీయం చేయడం పక్కా జరిగి జరుగు తీరుతుందనీ... తన నిర్ణయాన్ని మార్చలేరని సుబ్బారెడ్డిని తిరిగి పంపారు షర్మిల, విజయమ్మ.

ఆ తర్వాత షర్మిల వచ్చి ...పెళ్లి కార్డు ఇస్తుందని జగన్ కి ఫోన్ చేసి చెప్పారు విజయమ్మ. మొదట ఆయన షర్మిలను కలవడానికి అంగీకరించలేదు. విజయమ్మ బతిమిలాడడంతో చివరికి  ఒప్పుకున్నారు.  మళ్లీ నిన్న షర్మిల బయలుదేరే ముందు హైడ్రామా నడిచింది. చివరి నిమిషంలో జగన్ తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకున్నారు. మరోసారి విజయమ్మ రంగంలోకి దిగి... కోడలికి, కొడుక్కి నచ్చ చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు జగన్ - షర్మిల కలిసినప్పుడు తాను ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ ఉండనని చెప్పి... విజయమ్మ కారులో హైదరాబాద్ బయలుదేరి పోయారు. చివరికి సాయంత్రం మూడున్నరకు అనుకున్న భేటీ ఐదున్నరకి పొడిగించారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే స్పెషల్ ఫ్లైట్లో షర్మిల బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి లో జగన్ ఇంటికి తన కొడుకు, కాబోయే కోడల్నీ తీసుకొని వెళ్లారు. జగన్ ఒకే ఒక్క నిమిషం నిలబడి... పెళ్లి కార్డు తీసుకొని గదిలోకి వెళ్లిపోయారట. జగన్ భార్య భారతి మాత్రమే కూర్చొని అందరితోనూ 25 నిమిషాలు మాట్లాడారు.

జగన్ - షర్మిల కలిసినప్పుడు చుట్టుపక్కల ఒక్క కెమెరా కూడా లేకుండా జాగ్రత్తపడ్డారు.  ఒక్క ఫోటో కూడా తీయకుండా కఠిన ఆంక్షలు పెట్టారు. జగన్ తో ఫోటో దిగాలని కాబోయే వధూవరులు ప్రయత్నించినా కుదరలేదు. అన్నా చెల్లెలు మధ్య వైరం ఎంతగా పెరిగిందో బయట ప్రపంచానికి మరోసారి తెలిసింది. దీనికి తోడు జగన్ తో విభేదించి పార్టీకీ.... ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా షర్మిల తీసుకు రావడం, తాను షర్మిల ప్రతినిధిని అని ఒకటికి రెండుసార్లు సార్లు చెప్పుకోవడం, కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆర్కే ప్రకటించడం... ఇవన్నీ జగన్ కి మరింత ఇరిటేషన్ కలిగించాయి. పెళ్లి కార్డు అందుకోడానికి అయిష్టంగా అంగీకరించిన జగన్.... షర్మిల కొడుకు పెళ్లికి వస్తాడా అన్నది సందేహమేనని  రెండు వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

Published : 
  • 4 January 2024, 8:25 AM IST