Where is Vallabhaneni Vamsi? A tightening trap in that case
ఏపీలో వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ పైనా రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వైసీపీకి ఘోర పరాజయం తర్వాత కొడాలి నాని అప్పుడప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు. కాస్త టోన్ తగ్గించినా... విమర్శలు మాత్రం కొనసాగిస్తున్నాయ. కానీ వల్లభనేని వంశీ జాడ మాత్రం తెలియట్లేదు. వంశీ హైదరాబాద్ లో ఉన్నాడా... విదేశాలకు వెళ్ళిపోయాడా అని డౌట్స్ వస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్స్ ...బాబు, పవన్, లోకేశ్ పై ఒంటి కాలిమీద లేచేవారు... బూతులతో విరుచుకుపడేవారు. ఇప్పుడు బండ్లు ఓడలు అయ్యాయి. దాంతో కంటికి కనిపించకుండా పోయారు కొందరు వైసీపీ ఫైర్ బ్రాండ్స్... వాళ్ళల్లో రోజా, పోసాని కృష్ణ మురళీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొడాలి నాని అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. అసెంబ్లీలో చంద్రబాబు భార్యను అవమానించడం... లోకేశ్ ని వ్యక్తిగతంగా బూతులు తిట్టిన వంశీ మీడియాకు కూడా దొరకట్లేదు.
గన్నవరంలో వైసీపీ ఆఫీసు కూడా క్లోజ్ అయింది. కనీసం ఓటమిపై వల్లభనేని వంశీ సమీక్ష కూడా నిర్వహించలేదు. ఓటమి తర్వాత ఆయన విజయవాడకు వెళ్ళారా... హైదరాబాద్ లో ఉన్నారా... ఇవేవీ కాకుండా అమెరికా వెళ్ళిపోయారా అని టాక్ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వంశీ ... అమెరికా వెళ్ళారు. కూటమి ప్రభుత్వం గెలిస్తే... ఆయన ఏపీకి వచ్చే ఛాన్స్ లేదనీ... అక్కడే ఉంటారని టాక్ కూడా నడిచింది. కానీ రిజల్ట్స్ టైమ్ లో నియోజకవర్గంలో కనిపించిన వంశీ... ఆ తర్వాత మాయం అయ్యారు.
వల్లభనేని వంశీపై అనేక కేసులు ఉన్నాయి. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన పోలీసులు...పాత కేసులను తిరగదోడుతున్నారు. అందులో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కూడా ఉంది. ఆ కేసును రీఓపెన్ చేశారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు పోలీసలు. గన్నవరం వైసీపీ ఆఫీసులో ఉండి... వల్లభనేని వంశీయే టీడీపీ కార్యాలయంపై దాడి చేయించినట్టు నిర్ధారించారు. అప్పట్లో పోలీసులు అసలు నిందితులను వదిలేసి... టీడీపీ నేత పట్టాభిరామ్ తో పాటు మరికొందర్ని అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం మారాక... ఇప్పుడు పోలీసులు ఈ కేసులో 15 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇందులో వంశీ కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇక మిగిలింది వల్లభనేని వంశీయే అంటున్నారు. ఆయన కోసం ఇప్పటికే పోలీసులు సెర్చింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.