తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్గా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల బెంగళూరులో తెలుగు సినిమాల పోస్టర్లను కొందరు చించివేసిన ఘటనలు, భాషా పరమైన వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఆయన స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బెంగళూరులో కన్నడ సంఘాలు మన తెలుగు సినిమాల పోస్టర్లను చించివేసి, మన సినిమాలను ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, తాను మాత్రం ఆ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని పవన్ స్పష్టం చేశారు.
కన్నడ బ్లాక్బస్టర్ సినిమా కాంతారకు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు కోసం తాను సానుకూలంగా స్పందించానని ఆయన గుర్తు చేశారు. మన పోస్టర్లు అక్కడ చించేశారు కదా అని నేను ఇక్కడ వారిని ఇబ్బంది పెట్టలేదు. సినిమా అనేది ఒక కళ. దానికి ప్రాంతీయతతో సంబంధం లేదు," అని ఆయన పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సినిమా పట్ల తనకున్న దృక్పథాన్ని స్పష్టంగా వివరించారు. ఏ సినిమానైనా తాను ఒక ప్రాంతీయ చిత్రంగా చూడనని, ప్రతి సినిమానూ భారతీయ సినిమాగానే గుర్తిస్తానని చెప్పారు.
కళాకారులకు భాషా భేదాలు ఉండకూడదని, మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. సినిమా అనేది ప్రజలను కలిపే ఒక వారధి కావాలి తప్ప, విడదీసే ఆయుధం కాకూడదని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు మన వైపు నుండి సానుకూలతతోనే సమాధానం చెప్పాలన్న ఆయన ధోరణి రియల్ హీరో అనిపించుకుంటోంది. కాగా, ఉగాది సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.