Congress Party: తెలంగాణలో కర్నాటక వ్యూహం.. PAC మీటింగ్‌లో కాంగ్రెస్‌ కీలక నిర్ణయాలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలక్షన్‌ మూడ్‌ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పార్టీని రిపేర్‌ చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్‌ అగ్ర నేతలు. తెలంగాణలో జెండా పాతేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి ప్రతినిధులను పంపారు. వాళ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్‌.

Post Published By: Srikar Creator
Updated : 5 August 2023, 7:43 PM IST

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ సభ్యుడు దీప్‌దాస్‌ మున్షీ, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌ మానిక్‌ రావ్‌ థాక్రే ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటరీ అబ్జర్వేషన్‌ మీటింగ్‌ అనంతర పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కర్నాటక తరహా వ్యూహాన్ని అనుసరించాల్సిందిగా ఏఐసీసీ ప్రతినిధులు తెలంగాణ నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేవరకూ నేతలంతా ఒకే మాటపై పని చేయాలంటూ సూచించారు.

కర్నాటలో ప్రభుత్వం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్‌ నేతలు సక్సెస్‌ అయ్యారు. తెలంగాణలో కూడా ఇదే ఎజెండా పెట్టుకోవాలని పీఏసీ మీటింగ్‌లో నిర్ణయించారు. పాలన మొత్తం ఒక కుటుంబం చేతిలోనే బంధీ ఐపోయిందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటూ ఏఐసీసీ నేతలు టీపీసీసీ నేతలకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్‌ నేతల నిర్ణయం. ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్‌ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30 నియోవర్గాలకు క్యాండిడేట్‌లను త్వరలో డిక్లేర్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మరింత ఫోకస్‌ పెంచబోతోంది టీపీసీసీ.

ఎన్నికలు ముగిసేవరకూ నియోజకవర్గాల ఇంచార్జ్‌లు స్వంత నియోజకవర్గాల్లోనే ఉండాలని పీఏసీ సభ్యులు సూచించారు. ఏది ఏమైనా ఈసారి తెలంగాణలో జెండా ఎగరేయడమే ధ్యేయంగా పని చేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు.

 

Published : 
  • 5 August 2023, 7:43 PM IST