తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. జయలలిత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, జయలలితను స్మరించుకున్నారు. జయలలిత ఒక అసాధారణమైన పరిపాలకురాలు అంటూ కీర్తించారు మోడీ. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వారు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారని, అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలని మోడీ ప్రసంశించారు.
తమిళనాడు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నో సేవలు చేసారని మోడీ గుర్తు చేసుకున్నారు. జయలలిత అమలు చేసిన సంక్షేమ పథకాలు అద్భుతమని కొనియాడారు మోడీ. ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉండేవన్నారు ప్రధాని. ముఖ్యంగా మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదని కీర్తించారు. జయలలిత జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని చెప్తూ.. తాము ఇద్దరూ సిఎంలుగా ఉన్న సమయంలో రోజులను మోడీ గుర్తు చేసుకున్నారు.
అమ్మతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు మోడీ. 'మన్ కీ బాత్' లో మాట్లాడిన మోడీ.. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయలలిత హాజరు అయ్యారని, గతంలో పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి ఆహ్వానించిన విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవని, సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమని తెలిపారు.