ఈ రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల హామీలు.. గెలుపు ఓటములను ప్రభావితం చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే రాజకీయ పార్టీలు సంక్షేమ కార్యక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు తమిళనాడు ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనపడుతోంది. ఇటీవల మాజీ సిఎం జయలలిత జయంతి సందర్భంగా.. ఆ రాష్ట్ర మాజీ సిఎం పళని స్వామి ఇస్తున్న ఎన్నికల హామీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతీ కుటుంబానికి పది వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామంటూ ప్రకటించారు.
డిఎంకె ప్రభుత్వంలో గత 5 ఏళ్ళ నుంచి ప్రజలు ఫీజులు, పన్నులు, నిత్యవసర ధరల పెంపు కారణంగా ఇబ్బంది పడుతున్నారని, అందుకే ప్రతీ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని, అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచే ఈ హామీని తాము అమలు చేస్తామని పళని స్వామి పేర్కొన్నారు. ఇక తాము ఇచ్చిన ఈ హామీ సూపర్ హిట్ అయిందని, డిఎంకే ఇచ్చిన 5 వేల రూపాయల హామీని ఫ్లాప్ అంటూ కామెంట్ చేసారు. నిత్యావసర ధరల పెరుగుదలతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
దీనికి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపశమనం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఆయన ఇచ్చిన కొన్ని హామీలు చూస్తే.. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.2,000, ప్లస్ టూ వరకు చదివినవారికి రూ.1,000భ్రుతి, చిరు వ్యాపారుల రుణాల మాఫీ, మత్స్యకారులకు సహాయం రూ.8,000 నుంచి రూ.12,000కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్ర వాహనాలు, పురుషులకు నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. యువతను ఆకట్టుకునే దిశగా గతంలో జయలలిత ఇదే తరహా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేసేవారు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు పళని స్వామి.