ఏపీ పాలిటిక్స్ లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని మైక్ పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాని స్టైల్. అయితే తాజాగా వైసీపీ కార్యకర్తల సమావేశంలో కొడాలి నాని తన సొంత బాస్ వైఎస్ జగన్ గురించే ఒక షాకింగ్ కామెంట్ చేశారు. "జగన్ అసలు రాజకీయ నాయకుడే కాదు" అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అసలు కొడాలి నాని ఎందుకు అలా అన్నారు? జగన్ గురించి నాని బయటపెట్టిన ఆ సీక్రెట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి?
కొడాలి నాని మాటల్లోనే చెప్పాలంటే... జగన్ కు రాజకీయాలు చేయడం, ఎత్తుగడలు వేయడం అస్సలు తెలియదు. ఆయనకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే తెలుసు, అందుకే ఆయన రెండు సార్లు ఓడిపోయారు అని కూడా నాని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. ఒకవేళ జగన్ కేవలం డబ్బు, పదవి కోసమే చూసుకుంటే... హాయిగా తన వ్యాపారాలు చేసుకునేవారని, అప్పుడు ఆయన్ని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనేవారు కాదని నాని గుర్తుచేశారు. కానీ, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించడం కోసమే జగన్ పార్టీ పెట్టారని, ఈ క్రమంలో అధికారం వచ్చినా, రాకపోయినా జగన్ అస్సలు బాధపడరని నాని స్పష్టం చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో జగన్ తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడతారు తప్ప, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరని కొడాలి నాని కొనియాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని 2014 ఎన్నికల నాటి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ లతో కలిసి కూటమిగా ఏర్పడి, రైతు రుణమాఫీ లాంటి పెద్ద పెద్ద హామీలతో జనాల్లోకి వెళ్తున్నారని తామంతా జగన్ దగ్గరకు వెళ్లామని నాని చెప్పారు. చంద్రబాబుకు పోటీగా మనం కూడా రైతు రుణమాఫీ హామీ ఇద్దామని జగన్ ను కోరగా... దానికి జగన్ తీవ్రంగా నిరాకరించారట. "నేను చేయలేని, అమలు కాని అబద్ధపు హామీలను ప్రజలకు ఇవ్వలేను. చంద్రబాబు ఇస్తున్నాడు కానీ ఆయన కూడా దాన్ని అమలు చేయలేడు" అని జగన్ ఆరోజే తెగేసి చెప్పారని, ఆ తర్వాత సరిగ్గా అదే జరిగిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
కేవలం 2014లోనే కాదు, మొన్నటి 2024 ఎన్నికల ముందు కూడా సేమ్ ఇలాంటి సీన్ రిపీట్ అయిందని నాని రివీల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 'సూపర్ సిక్స్' పేరుతో భారీ హామీలు ఇస్తున్నారని, కూటమి కట్టి బలంగా వస్తున్నారని కొడాలి నాని మరియు పేర్ని నాని ఇద్దరూ కలిసి జగన్ దగ్గరకు వెళ్లారట. మనం కూడా ఎన్నికల్లో గెలవాలంటే మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తే బాగుంటుంది అని జగన్ కు సలహా ఇచ్చారట. దానికి జగన్ స్పందిస్తూ... "ఇప్పటికే ఇస్తున్న పథకాలకే రాష్ట్ర బడ్జెట్ ఇబ్బందిగా ఉంది, మళ్లీ ఓట్ల కోసం లేనిపోని కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేను" అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారని కొడాలి నాని గుర్తు చేసుకున్నారు.
జగన్ నిజాయతీగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టే ఆయన ఒకే ఒక్కసారి సీఎం అయ్యారని, అదే చంద్రబాబు అబద్ధపు హామీలతో నాలుగు సార్లు సీఎం అయ్యారని కొడాలి నాని విమర్శించారు. నిజం ఒక్కసారి భూమిని చుట్టి వచ్చేలోపు, అబద్ధం ఆరు సార్లు చుడుతుందనే సామెత ఏపీ పాలిటిక్స్ లో నిజమైందని ఆయన అన్నారు. ఏది ఏమైనా... ఒకవైపు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే జగన్, మరోవైపు ఎలాగైనా అధికారమే పరమావధిగా చూసే చంద్రబాబు మధ్యే ఈ పొలిటికల్ వార్ జరుగుతోందని నాని తేల్చేశారు.