ఇది ఒక సినిమా కథ కాదు.. అంతకు మించిన పొలిటికల్ థ్రిల్లర్. ఒకప్పుడు ఒక స్టార్ హీరో.. తన సినిమాను రక్షించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఇంటి గేటు ముందు గంటల తరబడి నిలబడ్డాడు. కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని ఆనాడు.. ఆ హీరో కళ్ళలో నీళ్లు తిరిగాయి. అదే హీరో సరిగ్గా 13 ఏళ్ల తర్వాత.. అదే ముఖ్యమంత్రి ఏలిన గడ్డపై జెండా పాతారు. జయలలిత లాంటి ఉక్కుమహిళే అడ్డుకోవాలని చూసినా.. కాలం ఆపలేకపోయింది. ఆయనే దళపతి విజయ్. నాడు అవమానించిన చోటే.. నేడు పట్టాభిషేకం జరుగుతోంది. అప్పటి ‘తలైవా’ వివాదం నుంచి నేటి సీఎం కుర్చీ దాకా.. విజయ్ ప్రస్థానం వెనుక ఉన్న ఆ సంచలన చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.
అది 2013.. విజయ్ కెరీర్ పీక్స్లో ఉన్న సమయం. ‘తలైవా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ సినిమా పోస్టర్పై ఉన్న 'Time To Lead' అనే ఒక చిన్న ట్యాగ్ లైన్ అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తే తన అధికారానికి ముప్పు అని భావించిన ఆమె.. రాజ్యాధికారాన్ని వాడుకుని ఆ సినిమాను తమిళనాడులో నిలిపివేశారు. బాంబు బెదిరింపుల సాకుతో థియేటర్ల వద్ద భయానక వాతావరణం సృష్టించారు. ఒక రకంగా విజయ్ని రాజకీయంగా పుట్టకముందే తుంచేయాలని చూశారు.
సినిమా ఆగిపోవడంతో వందల కోట్లు నష్టపోతున్న నిర్మాతలను చూసి విజయ్ తల్లడిల్లిపోయారు. నేరుగా జయలలితను కలిసి బ్రతిమిలాడదామని కొడనాడు ఎస్టేట్కు వెళ్లారు. తన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్తో కలిసి వెళ్లిన విజయ్ని.. జయలలిత కనీసం గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఒక స్టార్ హీరో అని కూడా చూడకుండా.. గంటల తరబడి ఆ ఎస్టేట్ గేటు బయటే ఎండలో నిలబెట్టారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోగా.. కనీసం మాట్లాడటానికి కూడా ఎవరినీ పంపలేదు. అది కేవలం విజయ్కి జరిగిన అవమానం కాదు.. తమిళ సినీ రంగానికే జరిగిన అవమానంగా అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
జయలలిత అక్కడితో ఆగలేదు. విజయ్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆ సినిమాకు పన్ను మినహాయింపులు నిరాకరించారు. వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో రిలీజ్ అయినా.. సొంత రాష్ట్రంలో మాత్రం సినిమాను రిలీజ్ కానివ్వలేదు. గత్యంతరం లేని స్థితిలో విజయ్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియోలో విజయ్ కళ్ళలో నీళ్లు చూసి తమిళనాడు చలించిపోయింది. 'నేను ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు.. దయచేసి మా సినిమాను ఆడనివ్వండి' అని వేడుకోవాల్సి వచ్చింది. ఒక మాస్ హీరోను అలా దీన స్థితిలోకి నెట్టడం వెనుక జయలలిత రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపించింది.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయం మారిపోయింది. ఆనాడు ఏ గేటు బయట అయితే విజయ్ని నిలబెట్టారో.. నేడు అదే తమిళనాడు ప్రజలు అసెంబ్లీ గేట్లు తెరిచి విజయ్ని ఆహ్వానిస్తున్నారు. 2026 ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జయలలిత వారసత్వ పార్టీ అయిన అన్నాడిఎంకే ను మూడో స్థానానికి నెట్టేసి.. విజయ్ కింగ్ లా ఎదిగారు. నాడు ఆపాలని చూసిన శక్తులన్నీ నేడు విజయ్ వేగాన్ని చూసి వణికిపోతున్నాయి. విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఓట్ల గెలుపు కాదు.. అది 13 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి ప్రజలు ఇచ్చిన సమాధానం. నాడు ‘అమ్మ’ ఎదిరించిన అదే విజయ్.. నేడు ప్రజల ‘అయ్య’గా మారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది.. దళపతి శకం మొదలైంది.