పొలిటికల్ మైండ్ గేమ్స్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పీహెచ్డీ చేసేసారు. తప్పు తమదే అయినా, ప్రత్యర్ధిది అయినా సరే.. మైండ్ గేమ్ ఆడటంతో లేటెస్ట్ పొలిటికల్ వరల్డ్ లో జగన్ ను బీట్ చేసే పొలిటికల్ లీడర్ కనపడటం లేదు. ఎక్కడ, ఎలా కొట్టాలో జగన్ కు పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారు. అసెంబ్లీకి జగన్ రావడం లేదు.. కానీ జగన్ ఉన్న ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. సభలో జగన్ మాట్లాడటం లేదు.. కానీ జగన్ ఎఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ గా కనపడుతోంది.
ఎస్.. శాసన మండలిలో వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ గురించే మాట్లాడుతున్నాం. కల్తీ లడ్డూ వ్యవహారంలో జగన్ అండ్ కో.. ని కూటమి సర్కార్ రౌండప్ చేసింది. సుప్రీం కోర్ట్ వేసిన సిట్ విచారణలో వెల్లడి అయిన అంశాలను కూటమి నేతలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ.. దాడి చేస్తున్నారు. ఈ దాడిలో వైసీపీ బలైపోతుందా అనే భయం ఆ పార్టీని అభిమానించే వారిలో కనపడింది. కానీ జగన్ ఇక్కడే వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారు. ఇందాపూర్ – హెరిటేజ్ బంధాన్ని తెలివిగా సభలో బయటకు లాగారు.
కల్తీ లడ్డూ పాపం మాది కాదు.. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడో చేసింది అంటూ సభలో ఓ రేంజ్ లో వైసీపీ.. టీడీపీని ఆడుకుంటుంది. కల్తీ లడ్డుపై చర్చించి.. వైసీపీని బద్నాం చేద్దాం అని ప్లాన్ చేసిన టీడీపీని.. జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఏ రోజు ఎలా సభలో వ్యవహరించాలో.. ఎమ్మెల్సీలకు ఎప్పటికప్పుడు జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. వాయిదా తీర్మానమే అస్త్రంగా వైసీపీ అడుగులు వేస్తోంది. పదే పదే మండలి చైర్మన్ తిరస్కరిస్తున్నా.. వైసీపీ వెనక్కు తగ్గడం లేదు. బొత్సా నాయకత్వంలోని ప్రతిపక్షం విమర్శల విషయంలో.. జగన్ ఎఫెక్ట్ చూపిస్తోంది.
ఇక శుక్రవారం అయితే.. వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని సభలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి సభలో చిన్నపాటి యుద్ద వాతావరణం కనపడింది. ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ సహా పలువురు కూటమి మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పయ్యావుల అయితే మైక్ విసిరేశారు. బొత్సా సత్యనారాయణ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. ఏ రేంజ్ లో వైసీపీ ఎమ్మెల్సీలను కంట్రోల్ చేయాలన్నా సరే కంట్రోల్ కావడం లేదు. ఆ అసహనం కూడా కూటమిలో కనపడింది.
కారణం.. జగన్ బ్యాక్ ఎండ్ లో ఉండి ఏం చేయాలో ఎప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు.. ఆ డైరెక్షన్ లో వైసీపీ చెలరేగిపోతోంది. అది ఎలా అంటే.. యుద్దాల్లో.. స్నైపర్ ను రహస్యంగా ఓ పొజిషన్ లో ఉంచుతారు. అక్కడి నుంచి ప్రత్యర్ధులను షూట్ చేస్తూ ఉంటాడు స్నైపర్. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. కంటికి కనపడకపోయినా.. తాను సభలో ఉన్న ఫీలింగ్ ను వైసీపీ కంటే కూటమికి.. ముఖ్యంగా టీడీపీకి కలిగించడంలో సక్సెస్ అవుతున్నారు. జగన్ తమ వెనుక ఉన్నారనే ధైర్యంతో వైసీపీ ఎమ్మెల్సీలు తాండవం ఆడుతున్నారు.
మార్చ్ 7 వరకు సభ జరగనుంది. అప్పటి వరకు సభలో వాతావరణం ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది. 2017 లో శాసన సభలో జగన్ ఉన్న ఫీలింగ్ ఇప్పుడు మండలిని చూస్తే కనపడుతోంది. బలం లేని చోట పోరాటం కంటే.. బలం ఉన్న చోట పోరాడితే ఎలా ఉంటుందో జగన్ అండ్ కో చూపిస్తున్నారు. జగన్ రాజకీయం దెబ్బకు.. కల్తీ లడ్డూ వ్యవహారంలో వైసీపీని ఆడుకునే పరిస్థితి నుంచి హెరిటేజ్ ను కాపాడుకునే పరిస్థితికి జగన్ తెచ్చారు. లీగల్ నోటీసుల వరకు హెరిటేజ్ ను నడిపించారు జగన్.
టీడీపీ సోషల్ మీడియా మొత్తం.. హెరిటేజ్ నాణ్యత కలిగిన సంస్థగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కల్తీ లడ్డూ అంశం మరుగున పడి.. ఇదే హైలెట్ అవుతోంది. ఇలా జగన్.. సభకు రాకపోయినా మాటు వేసి కొడుతున్నారు. ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వైసీపీ సభ్యులు కూడా అధినేత ఆదేశాలను పక్కాగా ఫాలో అయిపోతున్నారు. సభలో ప్రతిపక్షాన్ని లీడ్ చేసే విషయంలో ప్రతిపక్ష నేత బొత్సా సక్సెస్ అవుతున్నారు. 2024 తర్వాత వైసీపీకి పొలిటికల్ గా ఎనర్జీ తెచ్చిన సీన్లు మాత్రం మండలిలోనే గత వారం నుంచి కనపడుతున్నాయి.