ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల విధ్వంసం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియా జెర్సీని ధరించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. జూన్లో జరగనున్న భారత ఐర్లాండ్ పర్యటనకు వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తే.. భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించనున్నాడు. సెలెక్టర్లు ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ పేరును షార్ట్లిస్ట్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ భాగం కానున్నాడు. ఈ మ్యాచ్లు జూన్ 26, 28 తేదీలలో బెల్పాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరగనున్నాయి.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందే ఈ సిరీస్ నిర్వహించనున్నారు. ఐపీఎల్లో వైభవ్ చూపుతున్న అసాధారణ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు, అతనికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ ఐర్లాండ్తో జరిగే సిరీస్ వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేస్తే మాత్రం ఓ అరుదైన రికార్డు అతడి సొంతం అవుతుంది.టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చాడు.వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 37.66 సగటుతో 452 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 228.28గా ఉంది. కేవలం ప్రస్తుతం సీజన్లోనే 5 మ్యాచ్ల్లో 200 పరుగులు సాధించి 263.15 స్ట్రైక్ రేట్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బుమ్రా వంటి మేటి బౌలర్ను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్ బాదడం, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ పేసర్లపై ఆధిపత్యం చెలాయించాడు.సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో వైభవ్ డకౌట్ అయ్యాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో మొదటి వైఫల్యం. ఈ క్రమంలోనే మాజీ క్రీడాకారుడు సైమన్ డల్ వైభవ్కు ఓ ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. 15 ఏళ్ల వయసులో వచ్చే స్టార్డమ్, డబ్బు అతనిని తప్పుదోవ పట్టించకూడదని, మేనేజ్మెంట్ కంపెనీల స్వార్థానికి బలవ్వకుండా తన కెరీర్ సుదీర్ఘంగా సాగేలా చూసుకోవాలని సూచించాడు. వైభవ్ ఐర్లాండ్ పర్యటనలో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.