ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడున్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి ఏ మిస్సైల్ దూసుకువస్తుందో.. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. పలు దేశాలు ఎయిర్ స్పేస్ మూసి వేయడంతో.. స్వదేశానికి రాలేక.. అక్కడ ఉండలేక బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి భీకరంగా మారింది.
గల్ఫ్ ఆదాయవనరులతో పాటు.. అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్న దేశాల ప్రజలను టార్గెట్ చేసింది ఇరాన్. సౌదీ అయేబియాలో ఉన్న అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసింది. వేరే దేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఉండే అపార్ట్మెంట్లు, హై రైజ్ బిల్డింగులు, హోటల్స్ను టార్గెట్ చేసి దాడులు జరుపుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశారు ఎయిర్ స్పేస్ మూసి.. విమాన సర్వీసులు రద్దు చేశాయి. దీంతో టూరిస్టులు అక్కడే చిక్కుకుపోయి పరిస్థితులు తీవ్రంగా మారాయి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రజల విషయంలో వాళ్ల కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక భయంతో బతుకుతున్నారు.
సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దుబాయ్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం దుబాయ్లో మంచు విష్ణు ఫ్యామిలీ ఉన్నారు. ఇరాన్ దాడి చేసిన క్షిపణి దెబ్బకు తాను నివసిస్తున్న ఇల్లు షేక్ చేయిందని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆకాశంలో దూసుకొస్తున్న ఇరాన్ మిస్సైల్స్ వీడియో షేర్ చేశారు. ఆ క్షిపణుల భారీ శబ్దాలు తన కుమార్తె ఐరాను భయపెట్టాయన్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఎవరూ పెరగకూడదని.. శాంతి కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు భారత స్టార్ షట్లర్ PV సింధు సైతం దుబాయ్లో చిక్కుకున్నారు. దుబాయ్లో పరిస్థితులపై పీవీ సింధు ట్వీట్ చేసింది. “ఎయిర్పోర్ట్ దగ్గరలో బాంబులు పడ్డాయి. కోచ్ సహా మేమంతా పరుగులు తీశాం. భయానక పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం మేమంతా సురక్షితంగా ఉన్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్ స్టాఫ్, అథారిటీకి థ్యాంక్స్. ఇండియన్ హై కమిషన్ తమ భద్రపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. త్వరగా పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నామంటూ సింధు ట్వీట్ చేసింది. తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ముఖ్యంగా ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉపాధి కోసం వెళ్లిన వాళ్లు కొందరైతే.. టూర్లకు వెళ్లిన వాళ్లు మరి కొందరు. వాళ్లంతా ఇప్పుడు ఆ మిస్సైల్స్ దాడుల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ గురించి భారత్ హై కమీషన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఆయా దేశాల్లో ఉన్న ఎంబసీ అధికారులు ఇండియన్స్కు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు జారీ చేస్తూ.. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యేవరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.