తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, గౌరవం విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు. స్టార్ హీరోయిన్ 'త్రిష' వివాదాస్పద అంశంపై తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో అసలు ఏం జరిగిందంటే..
నటి త్రిషను ఉద్దేశించి కొందరు రాజకీయ నేతలు, సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలను సీఎం విజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో లేదా సమాజంలో ఎవరైనా సరే మహిళల వ్యక్తిగత విషయాల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "మహిళలకు గౌరవం లేకుండా మాట్లాడితే సహించేది లేదు. ఎవరైనా సరే మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటాం" అంటూ సీఎం విజయ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు.
కేవలం సినిమా రంగానికి చెందిన మహిళలే కాదు, సమాజంలో ఏ రంగంలో ఉన్న మహిళకైనా భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చాటిచెప్పారు. రాజకీయ విమర్శలు ప్రజా సమస్యలపై ఉండాలి తప్ప, మహిళల వ్యక్తిగత జీవితాలపై కాదంటూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా ముఖ్యంగా మహిళా లోకం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో మహిళల ఆత్మగౌరవానికి అండగా నిలబడిన దళపతి విజయ్ నిర్ణయంపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.