ఏడాది తర్వాత హాఫ్ సెంచరీ.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్న స్కై…!

టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక 468 రోజులు అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 10:00 PMLast Updated on: Jan 24, 2026 | 10:00 PM

A Half Century After A Year Sky Has Finally Found His Form

టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక 468 రోజులు అయింది. వరుసగా 23 ఇన్నింగ్స్‌ల పాటు పొట్టి ఫార్మాట్‌లో విఫలమవుతూ వస్తున్న స్కై.. కివీస్‌పై తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అలా ఇలా కాదు మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో అదరగొట్టాడు. రాయ్‌పూర్ వేదికగా జరిగిన భారత్ – న్యూజిలాండ్ రెండో టీ20లో అసాధ్యమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.రాయ్‌పూర్‌లో రెండో టీ 20 జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆరంభం నుంచే కివీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అయితే, పది ఓవర్ల తర్వాత మళ్లీ భారత బౌలర్లు ఫామ్‌లోకి రావడంతో 250 పరుగుల వరకూ వెళ్తుంది అనుకున్న స్కోర్ 208 వద్దే ఆగిపోయింది.

భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ చేజారిపోయిందని అందరూ అనుకున్నారు. మొదటి టీ20లో ఫర్వాలేదు అనిపించిన సూర్య.. రెండో టీ20ల్లో జట్టు బాధ్యతను మొత్తం తన భుజాలపై వేసుకుని తొలుత వికెట్ పడకుండా నిలకడగా ఆడాడు.టీమిండియా ఇక విజయ పథంలో వెళ్తుంది అనుకున్న సమయంలో స్కై తన సూపర్ స్పెషల్ షాట్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని చాటిచెప్పాడు. 37 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలకంగా మారాడు. స్కై, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

చాలా కాలంగా తనను వెంటాడుతున్న ఫామ్‌పై సూర్యకుమార్ యాదవ్ ఎన్నో ప్రెస్‌మీట్, పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో చెప్పుకొచ్చాడు. తాను ఫామ్‌లోనే ఉన్నానని, కానీ పరుగులే రావడం లేదని చెప్పడంతో అప్పట్లో అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు తన మాటలను నిజం చేసి చూయించాడు స్కై. టీ20 వరల్డ్‌కప్ ముందు సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.