ఓడినా గెలిచిన యువ కెరటం… భారత్ ను వణికించిన బెథెల్…!

ముంబైలోని వంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఒక యువ కెరటం భారత్‌ను వణికించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి అందరూ ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని భావించిన వేళ

Post Published By: dialnews
Updated : 6 March 2026, 7:45 PM IST

ముంబైలోని వంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఒక యువ కెరటం భారత్‌ను వణికించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి అందరూ ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని భావించిన వేళ, 22 ఏళ్ల జాకబ్ బెథెల్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. నాకౌట్ మ్యాచ్‌ ఒత్తిడిలో, అదీ టీమ్ ఇండియా స్టార్ బౌలర్లను ఎదుర్కొంటూ అతను ఆడిన తీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఒక దశలో ఇంగ్లాండ్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే నాలుగో నంబర్‌లో వచ్చిన జాకబ్ బెథెల్ ఏమాత్రం బెదరలేదు. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు.

భారత స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న బెథెల్, వాంఖడే మైదానం నలుమూలలా షాట్లు ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే అతను తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇది టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేసింది. బెథెల్ ధాటికి అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అతను రివర్స్ స్వీప్‌లు, స్లాప్ షాట్లతో విరుచుకుపడ్డాడు.ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ బెథెల్ తెగువ చూపాడు. 11వ ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టి, ఆ తర్వాత రెండు పరుగులు తీసి తన పట్టుదలను ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్లో సిక్సర్ బాదడం ద్వారా కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా బెథెల్ రికార్డు సృష్టించాడు.

చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి. శివం దూబే వేసిన 20వ ఓవర్ తొలి బంతికే బెథెల్ రనౌట్ అయ్యాడు. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా హార్దిక్ పాండ్యా విసిరిన త్రోకు శాంసన్ బెయిల్స్ ఎగరేశాడు. దీంతో బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేసి మైదానాన్ని వీడాడు. అతను అవుట్ అయ్యే వరకు భారత్‌కు ఓటమి భయం వెన్నాడుతూనే ఉంది.బెథెల్ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ 246 పరుగుల వద్ద ఆగిపోయింది. భారత్ 7 పరుగులతో గెలిచి ఫైనల్ చేరినప్పటికీ, మ్యాచ్ మొత్తానికి బెథెల్ ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఏడు సెంచరీలు నమోదవ్వగా, అందులో బెథెల్ చేసిన ఈ సెంచరీ అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటిగా నిలిచింది. వాంఖడే ప్రేక్షకులు సైతం ఈ యువ ఆటగాడి పోరాట పటిమను చప్పట్లతో అభినందించారు.

Published : 
  • 6 March 2026, 7:45 PM IST