Pawan Patlu for Kapula votes.. Nagababu secret meeting?
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలే టైమ్ ఉండటంతో.. ఏపీ పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఈసారి కాపుల ఓట్లు కలసి వస్తాయన్న ఉద్దేశ్యంతో జనసేనతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. కానీ మధ్యలో నారా లోకేష్ కామెంట్స్ తో ఆ వర్గం వారు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు కాపు నేత ముద్రగడ పద్మనాభం.. త్వరలో వైసీపీలో చేరతారన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాపుల ఓట్ బ్యాంక్ టీడీపీ - జనసేనకే పడేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కాపు నేతలతో మెగా బ్రదర్ నాగబాబు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది.
సాఫీగా సాగిపోతుంది అనుకున్న టీడీపీ-జనసేన కూటమిలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ అగ్గి రాజేశారు. రేపు తమ కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఒకసారి కామెంట్ చేశారు. ఆ తర్వాత మరో యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో.. పవన్ కల్యాణ్ కి డిప్యూటీ ఇవ్వాలా.. వద్దా అనేది టీడీపీ పొలిట్ బ్యూరో, చంద్రబాబు డిసైడ్ చేస్తారని అన్నారు. టీడీపీ –జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు, పవన్ చెరి రెండున్నరేళ్ళు అధికారంలో ఉంటారని కాపు నేతలు, జనసేన కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎప్పటికీ బాబే సీఎం అంటూ లోకేష్ చేస్తున్న కామెంట్స్ వాళ్ళకి కోపాన్ని తెప్పించాయి.
కాపు సంఘం నాయకుడు ముద్రగడ వైసీపీలో జాయిన్ అవుతారన్న టాక్స్ ఏపీలో నడుస్తున్నాయి. అదే జరిగితే కాపుల ఓట్లు వైసీపీ టర్న్ అయ్యే ఛాన్సుంది. కాపుల ఓట్లు జనసేనకు పడకపోతే ఇబ్బందే. అందుకే మెగా బ్రదర్, జనసేన లీడర్ నాగబాబు రంగంలోకి దిగారు. కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో విశాఖ బీచ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళవి మొబైల్ ఫోన్లు కూడా అనుమతించలేదు. ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ వ్యాఖ్యలపై.. నాగబాబు వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. పదవుల విషయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని వారికి నచ్చజెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఏపీలో రెండు సామాజిక వర్గాలే అధికారాన్ని అనుభవించాయి.. ఇప్పుడు మనకు కూడా ఛాన్స్ రావాలంటే జనసేనకు అండగా నిలబడాలని కాపు నేతలను నాగబాబు రిక్వెస్ట్ చేశారట. అభ్యర్థితో సంబంధం లేకుండా.. జనసేన-టీడీపీ కూటమి విజయం కోసం ఓట్లు వేయాలని కోరినట్టు తెలుస్తోంది. లోకేష్ కామెంట్స్ పై ఆగ్రహంగా ఉన్న కాపులు.. నాగబాబు మాటలకు కన్విన్స్ అయ్యారా. ఇప్పటికైనా జనసేనకు ఓట్లు వేసేందుకు ముందుకు వస్తారా.. లేదంటే ముద్రగడ వెళ్ళిన పార్టీనే గెలిపిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.