మహిళల టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ప్రదర్శిస్తున్న ఆధిపత్యం ఇప్పుడు భారత జట్టు సెమీస్ ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాకిస్థాన్పై ఆసీస్ సాధించిన ఘన విజయం గ్రూప్-ఎ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా భారత్కు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, రాబోయే మ్యాచ్లలో ఏ చిన్న పొరపాటు జరిగినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదముంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించి 8 పాయింట్టతో సెమీఫైనల్ కు దాదాపు చేరిపోయింది. భారత్ మూడు మ్యాచ్లలో రెండింటిని గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా.. తదుపరి మ్యాచ్లు అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు.
ఎందుకంటే మిగిలిన రెండింటిలో ఒక మ్యాచ్ బలమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం భారత్కు అత్యంత కీలకంగా మారింది.గ్రూప్-ఎ లో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే రాబోయే బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మ్యాచ్లలో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ రాబోయే రెండు మ్యాచ్లలో ఏదైనా ఒకదానిలో ఓడిపోతే, దక్షిణాఫ్రికాకు అవకాశాలు మెరుగవుతాయి. దక్షిణాఫ్రికా జట్టు తన తదుపరి మ్యాచ్లను బలహీనమైన నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్టులతో ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్లలో సౌతాఫ్రికా విజయం సాధిస్తే భారత్కు నిరాశ తప్పదు.గ్రూప్ అగ్రస్థానంలో నిలవాలన్నా లేదా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలన్నా భారత్ ముందున్నది పెద్ద ఛాలెంజ్ మాత్రమే. భారత జట్టు జూన్ 25న మాంచెస్టర్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.
ఆ తర్వాత జూన్ 30న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.ఇక టోర్నీలో పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ ఓటమిపాలై ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తన చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ ఘోరంగా విఫలమైంది. కేవలం 13.4 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియా 113 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోభారత జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. సమిష్టిగా రాణిస్తేనే భారత్ సెమీస్ కు చేరుతుంది. లేకుంటే గ్రూప్ స్జేట్ నుంచే ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.