CHIRU VIRALAM : పవన్ కి విరాళం ఎందుకిచ్చాడో.. చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నడిపిస్తున్న జనసేన (Janasena) పార్టీకి మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 April 2024, 11:24 AM IST

తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నడిపిస్తున్న జనసేన (Janasena) పార్టీకి మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇప్పటిదాకా పార్టీకి తన సంపాదనతో వచ్చిన డబ్బుల్నే ఖర్చు చేస్తున్నాడు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చిరంజీవి అంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం జనసైనికుల్లో ఉత్సాహం నింపింది. అసలు తాను ఎందుకు ఈ విరాళం ఇచ్చాడో మెగస్టార్ కూడా ట్వీట్ చేశారు.

ఇప్పటిదాకా తమ్ముడికి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేసిన మెగస్టార్ ఇప్పుడు ఏకంగా 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం ఇచ్చి... తన మద్దతును బహిరంగంగా చెప్పేశారు. విశ్వంభర మూవీ సెట్ లో పవన్, నాగబాబుని (Nagababu) పిలిపించుకొని విరాళం చెక్కు అందించారు. ఈ సందర్భంగా పవన్.. అన్నయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం... మెగా బ్రదర్స్ ముగ్గురి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

జనసేనకు విరాళం ఎందుకు ఇచ్చారో చెబుతూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నదమ్ముళ్ళు కలసి మాట్లాడుకున్న ఫోటోలు, విరాళం చెక్కు ఇచ్చిన ఫోటోలను షేర్ చేశారు మెగాస్టార్. అందరూ అధికారంలోకి వచ్చాక సాయం చేస్తాం అంటారు... కానీ అధికారం లేకపోయినా... తన సంపాదను రైతు కూలీల కోసం పవన్ కల్యాణ్ వినియోగించడం సంతోషంగా ఉంది. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని... నేను సైతం... జనసేనకు విరాళాన్ని అందించాను... అని పోస్ట్ చేశారు చిరంజీవి.

ఇన్నాళ్ళు తమ్ముడికి వెనక ఉండి సపోర్ట్ చేసిన చిరంజీవి... ఇప్పుడు విరాళం ఇస్తూ బహిరంగంగా సపోర్ట్ చేయడంపై జనసైనికులు సంతోషంగా ఉన్నారు. ఇక మెగాస్టార్ రంగంలోకి దిగాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమ్ముడి జనసేన అంటే చిరంజీవి ఇష్టం లేదంటూ మొన్నటిదాకా కామెంట్ చేసిన వైసీపీ లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ అండ ఉందని చిరంజీవి మెస్సేజ్ తో తేలిపోయింది. చిరంజీవి జనసేనకు డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా... అండగా ఉన్నాడన్న సంకేతాలు పంపితే చాలంటున్నారు జనసైనికులు. అయితే మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి వారు గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగుతారని జనసైనికులు చెబుతున్నారు.

 

Published : 
  • 9 April 2024, 11:24 AM IST