ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సంచలన పరిణామం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారు. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కాపు సామాజికవర్గ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు జగన్ స్వయంగా వెళ్ళారు. అయితే.. ఈ పర్యటన వెనుక కేవలం పరామర్శ మాత్రమే ఉందా? లేక ఏపీ రాజకీయాల్లో వెల్లువెత్తిన తీవ్ర విమర్శల నుండి తప్పుకోవడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఉందా? 'సొంత నేతలను జగన్ పట్టించుకోరు' అనే ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ లేట్ పర్యటనా?
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ముద్రగడ పద్మనాభం ఎంతలా శ్రమించారో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ను ఓడించడమే లక్ష్యంగా, అవసరమైతే తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేసి మరీ వైసీపీ కోసం ముద్రగడ అహోరాత్రులు కష్టపడ్డారు. అలాంటి సీనియర్ నేత, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్పై ఉంటే.. జగన్ కనీసం స్వయంగా వచ్చి పరామర్శించకపోవడంపై కాపు సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 'పని అయిపోయాక ముద్రగడను జగన్ పూర్తిగా వదిలేశారు' అంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే తిట్టిపోసే పరిస్థితి వచ్చింది. ఈ విమర్శల సెగ వైసీపీ అధిష్ఠానానికి గట్టిగా తాకింది.
రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని గమనించిన జగన్.. మొదట తన ముఖ్య అనుచరుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి పంపి పరిస్థితిని కవర్ చేయాలని చూశారు. కానీ, సజ్జల పర్యటన ఆ వ్యతిరేకతను ఏమాత్రం చల్లార్చలేకపోయింది. 'పార్టీ కోసం సర్వస్వం ధారపోసిన నేతను చూడటానికి అధినేతకు తీరిక లేదా?' అంటూ విమర్శలు మరింత ముదిరాయి. దీంతో తీవ్రమైన 'పొలిటికల్ డ్యామేజ్' జరుగుతోందని గ్రహించిన వైఎస్ జగన్.. ఇక లాభం లేదనుకుని, తనే స్వయంగా రంగంలోకి దిగక తప్పలేదు. విమర్శల నోళ్లు నొక్కడానికే చివరి నిమిషంలో ఈ హైదరాబాద్ పర్యటనను ప్లాన్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లేట్ పర్యటన వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. ముద్రగడను పరామర్శించకపోతే కాపు సామాజికవర్గంలో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న తరుణంలో, ఉన్న కాస్త మద్దతును కూడా కోల్పోవడం జగన్కు అస్సలు ఇష్టం లేదు. అందుకే, 'నేను ముద్రగడ కుటుంబానికి అండగా ఉన్నాను' అని చూపించుకోవడానికి, అటు కాపు సామాజికవర్గానికి భరోసా ఇవ్వడానికి ఈ పర్యటనను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. విమర్శలు వచ్చిన తర్వాత వెళ్లినా.. అది పొలిటికల్ గా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికే అనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనప్పటికీ, ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ రాజకీయంగా చూస్తే మాత్రం జగన్ తీసుకున్న ఈ లేట్ డిసిషన్ ఆయనపై వచ్చిన విమర్శలను కవర్ చేయగలుగుతుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.